Thursday 1 October 2015

రుక్మిణి సందేశము

సత్యనారాయణ పిస్క గారి వ్యాఖ్యానము:
 అందరికీ "శ్రీకృష్ణాష్టమి" శుభాకాంక్షలు. ఈ పర్వదిన సందర్భంగా మనందరిపైనా రుక్మిణీవల్లభుడైన ఆ నల్లనయ్య కరుణామృత దృక్కులు ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. 

        "ఆంధ్ర మహా భాగవతము" లోని రుక్మిణీకళ్యాణ గాథ సుప్రసిద్ధం. మధురాతిమధురమైన ఆ ఘట్టం సర్వులకూ ప్రీతిపాత్రమైనదే! ఆ కథలోని అంతర్భాగమైన "రుక్మిణీ సందేశము గురించి నా బుద్ధికి తోచినంతమేరకు విశ్లేషణాపూర్వకంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పోతనామాత్యులవారి రచనా రామణీయకతను, ముకుందుని ముందర రుక్మిణీరమణి అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించిన విధానమును తెలపడమే నా ముఖ్యోద్దేశము. 

        రుక్మిణీకళ్యాణ గాథను ముందుగా సంక్షిప్తంగా తెలుసుకుందాము. 

        ద్వాపరయుగములో విదర్భరాజ్యాన్ని భీష్మకుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ఐదుగురు కుమారుల తర్వాత, చివరిగా కడగొట్టు సంతానంగా శ్రీమహాలక్ష్మి అంశతో రుక్మిణి జన్మించింది. తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యౌవనవతి అయినదాదిగా శ్రీకృష్ణుని గుణగణాల గురించి, బలపరాక్రమాల గురించి కర్ణాకర్ణిగా విన్న రుక్మిణి, ఆయననే వివాహం చేసుకోవాలని తన మనస్సులో నిశ్చయించుకుంటుంది. కన్నవారికి, ఇతర బంధుగణానికి ఈ సంబంధం సమ్మతమే! కాని, రుక్మిణి పెద్దన్న ఐన రుక్మి కి మాత్రం, తన సోదరిని కృష్ణునికి ఇవ్వడం ఇష్టం లేదు. మహారాజు వృద్ధుడైనందువల్ల, అన్ని వ్యవహారాల్లో రుక్మి పెత్తనమే సాగేది. చండశాసనుడైన అతని మాటకు ఎదురుచెప్పే సాహసం ఎవరికీ లేదు. రుక్మి తన ఆప్తమిత్రుడు, చేదిరాజ్యానికి అధిపతియైన శిశుపాలునితో తన చెల్లెలి వివాహం నిశ్చయించి, శిశుపాలుణ్ణి సపరివారంగా పెళ్ళికి తరలిరమ్మని ఆహ్వానం సైతం పంపిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆందోళనకు లోనైన రుక్మిణి, తనవారెవ్వరూ తనకు సహాయం చేయలేరని గ్రహించి, తీవ్రంగా ఆలోచిస్తుంది. 

        తమ కుటుంబానికి ఆత్మీయుడైన "అగ్నిద్యోతనుడు" అనే బ్రాహ్మణోత్తముని రావించి, తన పరిస్థితిని వివరించి, తన సందేశాన్ని ద్వారకలోని శ్రీకృష్ణునికి అందజేసి తనకు సాయపడవలసిందని ప్రార్థిస్తుంది. పరోపకారపారీణుడైన ఆ విప్రవరుడు అందుకు సమ్మతించి, ద్వారకకు వెళ్ళి, రుక్మిణీసందేశాన్ని ఆ వంశీధరునికి విన్నవిస్తాడు. ఇక, ఆ తర్వాత వాసుదేవుడు విదర్భకు వచ్చి, గౌరీపూజకై నగరం వెలుపలి ఆలయానికి వచ్చిన రుక్మిణిని తన రథంలో ఎక్కించుకుని వెళ్ళడం, అడ్డునిలిచిన శిశుపాల జరాసంధులను యుద్ధంలో పరాజితులను చేయడం, పిమ్మట రుక్మి ని సైతం ఓడించి పరాభూతుణ్ణి చేయడం జరుగుతాయి. ఆ తర్వాత ద్వారకలో రుక్మిణీకృష్ణుల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఇదీ సంగ్రహంగా రుక్మిణీకళ్యాణ కథ. 

   వ్యాసభగవానులవారి "సంస్కృత భాగవతము" లో రుక్మిణీసందేశము సప్తశ్లోక సమన్వితం. అనగా, ఆమె శ్రీకృష్ణునికి పంపిన సందేశము 7 శ్లోకముల్లో అక్షరబద్ధం చేయబడింది. పోతనగారు ఈ ఘట్టాన్ని 8 పద్యరత్నాల్లో అందంగా, అద్భుతంగా తెనిగించారు. ' వ్యాసుని కంటే పోతన ఒక ఆకు ఎక్కువే చదివాడు ' అనలేము కానీ, సంస్కృత భాగవతాన్ని మించి "ఆంధ్ర భాగవతము" అత్యంత ప్రజాదరణ పొందినదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోతన తన ఆంధ్రీకరణం ద్వారా ' గీర్వాణ భాగవత సుందరి ' అందచందాలకు అద్భుతమైన అలంకరణలు పొదిగి, సొబగులూ సోయగాలతో తీర్చిదిద్దాడు. 

***        ***        ***        ***

        పురాణప్రసిద్ధమైన పాత్రలను తలచుకున్నప్పుడు, ఆ యా పాత్రల స్వరూప స్వభావాలకు అనుగుణమైన ఒక రూపచిత్రం మన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమౌతుంది. "రుక్మిణి" అనగానే లక్ష్మీకళ ఉట్టిపడే సుందరరూపంతో, ప్రశాంతవదనముతో అణకువగా, అమాయకంగా ఉండే ఒక సాధ్వీమణి మన ఊహల్లో సాక్షాత్కరిస్తుంది. ఇవన్నీ నిజమే కాని, రుక్మిణి అమాయకురాలు మాత్రం కాదు! పైగా ధైర్యసాహసాలు, తెలివితేటలు కలిగివున్న యువతి!..... అదెలాగో, కాసింత పరిశీలిద్దాము. 

        రాకుమారుడు రుక్మి అంటే విదర్భరాజ్యములో అందరికీ హడల్! అతని మాటే వేదంగా చలామణీ అయ్యేది అక్కడ! కన్న తల్లిదండ్రులు సైతం అతని పలుకులకు ఎదురాడలేకపోయేవారు! అటువంటి పరిస్థితుల్లో, తన జ్యేష్ఠసోదరుని ఇష్టానికి వ్యతిరేకంగా, సుక్షత్రియ వంశ సంజాతయైన ఒక రాజకన్య, వివాహం నిశ్చయమైన యువతి, పరపురుషునికి ప్రేమసందేశం పంపించాలంటే ఎన్ని గుండెలు కావాలి?! ఎంత తెగువ ఉండాలి?!...... దీనిని బట్టి రుక్మిణి యొక్క సాహసగుణం మనకు తెలుస్తోంది. 

        పోతే, తన సందేశాన్ని తీసుకువెళ్ళడానికి ఒక భూసురుణ్ణి ఎంచుకోవడంలో రుక్మిణి బుద్ధికుశలత, వివేకం మనం గమనించవచ్చు! 

        ఆమె రాచకన్నె కనుక, తన అధీనంలో ఉండే వార్తాహరుణ్ణిగానీ, సైనికుణ్ణిగానీ పంపించవచ్చు. కాని, అలా చేస్తే తన సోదరునికి తెలిసే అవకాశం ఉంది; తన పథకం విఫలం కావచ్చు! బ్రాహ్మణోత్తముడిని ఎవరూ సందేహించరు. 

 విప్రుడే సందేశహరుడు కావడానికి మరో కారణం కూడా ఉంది. వార్తాహరుని ద్వారా పంపితే సందేశాన్ని గమ్యస్థానానికి చేర్చగలడే తప్ప, మరో ప్రయోజనమేదీ సిద్ధించదు. బ్రాహ్మణవర్యుడైతే అన్నీ తెలిసిన పండితుడు కాబట్టి, కేవలం సందేశం అందించడమే కాక, సమయానుకూలంగా మాట్లాడి కార్యాన్ని సానుకూలం చేయగలడు. తన గురించి, తన ప్రేమ గురించి గోవిందునికి తెలియజెప్పి, ఆయన డెందములో తన పట్ల అనురాగం అంకురించేలా చేయగలడు. 

        మరో విషయం ఏమంటే - తాను శ్రీకృష్ణుడిని వలచింది కాని, ఆ ముకుందుని మనసులో తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తనకు తెలియదు. మామూలు భటునితో సందేశం పంపితే, ఆయనకు తానంటే తేలికభావం, చులకన కలిగే అవకాశం ఉంది. ఒక గౌరవనీయుడైన వ్యక్తి సందేశహరుడైతే, ఆ పరంధామునికి తన పట్ల పవిత్రభావం ఏర్పడుతుందని రుక్మిణి ఆశించింది. 

        బ్రాహ్మణుడైన అగ్నిద్యోతనుడు సందేశం తీసుకెళ్ళడం వలన రుక్మిణి కోరుకున్న ప్రయోజనాలన్నీ నెరవేరాయి. "రుక్మిణీ కళ్యాణం" పఠించిన సాహితీప్రియులకు ఇవన్నీ అవగతమే! 

        మరి, ఇన్నివిధాలుగా ఆలోచించి తన కార్యాన్ని సఫలం చేసుకోగలిగిన రుక్మిణి తెలివితేటలు తేటతెల్లమే కదా! 

        ఉపోద్ఘాతం సుదీర్ఘం అయినట్టుంది......... ఇంతటితో ముగించి, రుక్మిణీసందేశ రూపంగా ఉన్న 8 పద్యాలలో మొదటిదానిని తీసుకుంటున్నాను. ముందుగా పద్యమును చిత్తగించండి. 

మొదటి పద్యము

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక
.......దేహతాపంబులు దీఱిపోవు
ఏ నీ శుభాకార మీక్షింపఁ గన్నుల
.......కఖిలార్థలాభంబు గలుగుచుండు
ఏ నీ చరణసేవ లేప్రొద్దు చేసిన
.......భువనోన్నతత్వంబుఁ బొందగలుగు
ఏ నీ లసన్నామ మేప్రొద్దు భక్తితో
.......దడవిన బంధసంతతులు వాయు

అట్టి నీయందు నా చిత్త మనవరతము
నచ్చియున్నది, నీయాన! నాన లేదు!
కరుణ జూడుము కంసారి! ఖల విదారి!
శ్రీయుతాకార! మానినీ చిత్తచోర!
రుక్మిణి శ్రీకృష్ణునికి పంపిన ప్రణయసందేశములోని ప్రథమ పద్యం ఇది! మొదట పద్యభావాన్ని పరిశీలిద్దాము. ఇందులో రుక్మిణి శ్రీకృష్ణుని మహత్తును ఉగ్గడించి, తాను ఆయనను వరించాననీ, తనను కరుణించి చేపట్టవలసిందనీ విన్నవించుకుంటున్నది. 

        కంసాది దుష్టులను దునుమాడిన పరంధామా! ఓ శ్రీకృష్ణా! నీ శుభప్రదమైన కళ్యాణగుణములను ఆకర్ణించినంతనే దేహతాపములు, తాపత్రయాలు అన్నీ తగ్గిపోతాయి. నీ దివ్యమంగళ రూపాన్ని దర్శించిన నయనాలకు ఈ జగత్తులోని సకల రూపాలనూ చూసినంతటి భాగ్యం అబ్బుతుంది. ఎందుకంటే, జగమంతా భగవత్ స్వరూపమే కదా! అన్ని ప్రాణుల్లోనూ భగవానుడైన ఆ సర్వాంతర్యామే కొలువై ఉన్నాడని చెప్తారు విజ్ఞులు. శ్రీకృష్ణుని దర్శనమాత్రం చేత అఖిలప్రాణులనూ దర్శించినట్లే మరి! 

        ఇక్కడ పోతనగారు "అఖిలార్థలాభంబు" అనే మాటను ప్రయోగించారు. ' అఖిలము ' అనగా ఖిలము కానిది; అంటే నాశనము లేనిది అని అర్థం. ' అఖిలార్థము ' అంటే ఖిలం కాని శాశ్వతమైన పురుషార్థము. ధర్మార్థకామమోక్షములు అనబడే చతుర్విధ పురుషార్థములలో, చివరిదైన మోక్షమే శాశ్వతమైనది. అందువల్ల ఆ వాసుదేవుని దర్శనం వలన మానవులు దుర్లభమైన మోక్షప్రాప్తికి చేరువ కాగలరనే అర్థం ఈ పద్యపాదములో స్ఫురిస్తున్నది. భగవత్ సాక్షాత్కారం పొందినవారికి కైవల్యం కరతలామలకమే కదా! 

        ప్రతిదినమూ నీ పాదపూజను చేసేవారికి లోకాధిక్యం సిద్ధిస్తుంది; జీవితంలో అట్టివారు మహోన్నతిని పొందగలుగుతారు. భక్తితో నిత్యమూ నీ నామస్మరణ చేసేవారికి ఈ సంసారబంధములు తొలగిపోతాయి; పరమపదప్రాప్తి వారికి సులభతరం అవుతుంది. అటువంటి పరాత్పరుడవైన ఓ కృష్ణా! నా మనస్సు నీయందు లగ్నమైనది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. "నీ ఆన సుమా!" అని సాక్షాత్తూ ఆ మురళీధరుని పైనే ఒట్టు పెట్టుకుని చెప్తున్నది రుక్మిణి! పైగా "నాన లేదు" అనికూడా అన్నది. ' నాన ' అనగా సిగ్గు. సాధారణంగా తమ మనోగతమైన విషయాలను వెల్లడించడానికి స్త్రీలు, ముఖ్యంగా కన్యలు సిగ్గుపడడం లోకసహజం. కాని, ఇక్కడ రాకుమారి రుక్మిణి తాను శ్రీకృష్ణుడినే మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నానని సిగ్గును వదిలేసి, నిర్భీతిగా ప్రకటిస్తున్నది! ఈ సందర్భములో మనం ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఆమె అన్నగారైన రుక్మి, తన సోదరి వివాహాన్ని శిశుపాలునితో జరపాలని నిర్ణయించాడు. ముహూర్తానికి ఎక్కువ వ్యవధి లేదు. అందుకే రుక్మిణి, తన సందేశములోని తొలి పద్యములోనే తన మనోభావాన్ని సూటిగా, నిస్సంకోచంగా, విస్పష్టంగా ఆ వంశీమోహనుని ముందు వ్యక్తం చేసింది. మరి, ఇలాంటి సమయములో తాత్సారం చేయడం తగదు కదా! ఈ విషయాలన్నీ వివరించి, తనను కరుణించి కాపాడమని వేడుకున్నది. 
 పద్యము చివరిలో ఆమె ప్రయోగించిన సంబోధనలు సాభిప్రాయములు. "శ్రీయుతాకార! మానినీ చిత్తచోర!" అని శ్రీకృష్ణుణ్ణి సంబోధించి పలికింది. "శ్రీ" అనగా "లక్ష్మీదేవి""శ్రీయుతాకారుడు" అంటే"లక్ష్మీదేవితో కూడిన దివ్యమంగళ విగ్రహుడు" అని అర్థం. మహాలక్ష్మి అంశతోనే రుక్మిణి ప్రభవించిన విషయం ఆ పురుషోత్తమునికి తెలిసినదే కదా! ఈ సంబోధన ద్వారా రుక్మిణి "నేను నీ అర్ధాంగినైన లక్ష్మినే సుమా! ఉపేక్ష వహించవలదు" అని చెప్తున్నదన్నమాట! 

        మరి, రెండవ సంబోధనగా "మానినీ చిత్తచోర!" అంటున్నది. అనగా "మానినీమణుల హృదయాలను దొంగిలించినవాడు" అని అర్థం. ' మానిని ' అంటే సామాన్యార్థం 'స్త్రీ' అయినప్పటికీ, కాస్త లోతుగా పరికిస్తే'అభిమానవతియైన స్త్రీ' అనే అర్థం తోస్తుంది. "నేను మామూలు యువతిని కాదు. ఎంతో ఆభిజాత్యం, ఆత్మాభిమానం కలిగిన రాజకుమార్తెను. నా మనసును హరించిన నీవు, నా మనోభావాన్ని గ్రహించి, నా అభీష్టాన్ని నెరవేర్చాలి" అని ఉద్బోధిస్తున్నది రుక్మిణి. 

        ఈ విధంగా సమయోచితమైన సంబోధనలతో ఈ పద్యాన్ని సమలంకృతం చేశారు పోతనామాత్యులు! 

        ఇంతమాత్రమే కాక, ఈ పద్యములో మరొక విశేషం సైతం ఇమిడివుంది. 

        రుక్మిణి కేవలం శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడమే కాదు; భక్తితో ఆరాధించింది. భక్తిలో ' నవవిధభక్తులు ' ఉన్నాయని వేదవ్యాసమహర్షి తమ "సంస్కృత భాగవతము" లో ప్రహ్లాదుని ముఖతా ఈ క్రిందివిధంగా చెప్పించారు. 
"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం"
        ఈ భావాన్నే పోతనగారు "ఆంధ్ర భాగవతము" లో ప్రహ్లాదునిచేత ఇలా పలికించారు. 
"తను హృ ద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలోనెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!"
 మనం చెప్పుకుంటున్న రుక్మిణీసందేశ సీసపద్యములోని నాలుగు పాదములలో నాలుగువిధములైన భక్తిమార్గములను నిక్షేపించారు పోతనామాత్యులు! మొదటిపాదములో భగవానుని కళ్యాణగుణములను ఆకర్ణించడంలో శ్రవణభక్తి, రెండపాదములో ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని తిలకించడంలో దర్శనభక్తి, మూడవపాదములో పాదసేవనము, నాలుగవపాదములో కీర్తనభక్తి ఆవిష్కృతములైనవి. ఐతే, 2వ పాదములో చెప్పబడిన ' దర్శనభక్తి ' అనేది నవవిధభక్తులలో లేదు. నారదమహర్షి తన "నారద భక్తిసూత్రములు" లో ' ఏకాదశ భక్తిరీతులు ' గురించి వివరించారు. అందులో రెండవది ' రూపాసక్తి '. అనగా భగవంతుని రూపాన్ని తిలకించే ' దర్శనభక్తి ' అన్నమాట! దీనినే పోతనగారు తన పద్యములోని 2వ పాదములో పొందుపరిచారు. 

        ఈ విధంగా రుక్మిణీసందేశములోని ఈ ప్రథమ పద్యము సర్వవిధములా సమగ్రశోభితమై అలరారుతున్నది. 

        ఇప్పుడు రెండవ పద్యము గురించి తెలుసుకుందాము. 

రెండవ పద్యము

ధన్యున్, లోక మనోభిరాముఁ, గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతాలలామంబు, రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్.
        ఈ రెండవ పద్యములో శ్రీకృష్ణునిపై తనకు కలిగిన మోహాన్ని, అనురాగాన్ని రుక్మిణి సమర్థించుకుంటున్నది. ఏ విధంగానో చూద్దాము. 

        ఆమె శ్రీకృష్ణుని సకల సద్గుణాల పట్టికను ఏకరువు పెట్టింది. ఒకటా? రెండా? ఆ మహాత్ముని గుణములు ఎన్నని చెప్పగలం?!......... ఆయన పుణ్యశీలుడు. లోకుల మనస్సులను ఆకర్షించే అందం కలవాడు. "వంశం, విద్య, రూపం, యౌవనం, మంచితనం, సంపద, బలము, దానగుణం, పరాక్రమం, దయ - ఇన్ని గుణములచే ప్రకాశించే నిన్ను కోరని కన్యలు ఎవరైనా ఉంటారా?" అని రుక్మిణి ఆ నందనందనుడినే ప్రశ్నిస్తున్నది. "ఎవరి సంగతో ఎందుకు? స్త్రీలోకానికే శిరోభూషణమైన లక్ష్మీదేవి నాడు నిన్ను వరించలేదా? ఇంక నేను నీపై మనసు పడడంలో వింత ఏమున్నది?" అంటూ తన ప్రేమను సమర్థించుకుంటున్నది. 
   ' కాంతాలలామంబు ' అనగా ' స్త్రీలలో శ్రేష్ఠురాలు ' అని అర్థం. ' రమ ' అంటే లక్ష్మి. "నిన్ను కోరని కన్యలు ఉంటారా?" అంటూ, వెనువెంటనే లక్ష్మీదేవిని పేర్కొనడం రుక్మిణి చురుకుదనాన్ని సూచిస్తున్నది. తాను మామూలు కన్యల వంటిదానిని కాననీ, లక్ష్మీదేవి అంశనేననీ చెప్పకనే చెప్తున్నది. 
"కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శ్రుతం
బాంధవాః కులమిచ్ఛంతి, మృష్టాన్న మితరే జనాః"
        అని శాస్త్రవచనం. అనగా వరునిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం ఉండాలని కోరుకుంటారట! పెళ్ళీకూతురు తనకు కాబోయే భర్త మంచి అవయవసౌష్ఠవం కలిగిన అందగాడు కావాలని ఆశిస్తుంది. వధువు తల్లి అతడు భాగ్యవంతుడై ఉండాలనీ, తండ్రి విద్యాకీర్తులు కలవాడై ఉండాలనీ, చుట్టపక్కాలు మంచి వంశములో జన్మించినవాడై ఉండాలనీ, ఇతర జనమంతా షడ్రసోపేతమైన భోజనం పెట్టగలిగేవాడై ఉండాలనీ కోరుతారట! మరి, కేవలం ఈ గుణాలే కాక, ఆ పురుషుడు సర్వసద్గుణ సంపన్నుడు ఐనప్పుడు అతణ్ణి వరించని కన్యలు ఉంటారా?! 

        ఈ పద్యములో సైతం రుక్మిణి, ఆ శౌరిని ఉద్దేశించి ఒక గంభీరమైన సంబోధన ప్రయోగించింది."రాజన్యానేకపసింహ!" అనేది ఆ సంబోధన! "అనేకపము" అంటే "మదపుటేనుగు" అని అర్థం."రాజన్యానేకపసింహ" అనగా "మదించిన ఏనుగుల్లాగా గర్వంతో క్రొవ్వి సంచరించే రాజులకు సింహంలాంటివాడు" అనే అర్థం వస్తుంది. ఈ సంబోధన కూడా సాభిప్రాయమైనదే! రాబోయే కథాసూచన ఇందులో ఇమిడివుంది. రుక్మిణీహరణంలో రణం తప్పదు. ఈ విషయం ఆ రాచకన్నెకు తెలియనిదేమీ కాదు. మత్తెక్కిన రుక్మి, శిశుపాలుడు మున్నగు రాజులు మదపుటేనుగుల్లా ఎదురు తిరుగుతారు. శ్రీకృష్ణుడు వారి పాలిటి సింహమై పరాక్రమిస్తాడు. వారి గర్వాన్ని ఛేదిస్తాడు. ఇంతటి దృఢవిశ్వాసం రుక్మిణిలో ఉంది. కనుకనే ఆమె సంబోధనలో జరుగనున్న కథ ధ్వనించింది. 

        మరి ఇప్పుడు మూడవ పద్యాన్ని స్వీకరిద్దాము. 

మూడవ పద్యము

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ
ధ్యాయినియైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెదనంచు నున్నవా
డా యధమాధముం డెఱుగ డద్భుతమైన భవత్ప్రతాపముల్.
 ఈ పద్యములో రుక్మిణి వీరభోగ్యమైన సొత్తును అధముడు అంటరాదని ప్రకటిస్తున్నది. 

        శ్రీకృష్ణుణ్ణి పదేపదే శ్రీపతిగా సంబోధించనిదే రుక్మిణికి తృప్తి లేదు. "శ్రీయుతమూర్తి" అంటూ పద్యాన్ని ప్రారంభిస్తున్నది. అనగా, "లక్ష్మీదేవితో కూడియుండేవాడా!" అని అర్థం. తనకు తెలియకుండానే తానే లక్ష్మిననే అభిప్రాయం ఆమె వాదనలో తొంగిచూస్తున్నది. 

        రెండవ సంబోధనగా "పురుషసింహమా!" అన్నది. అంటే, "పురుషులలో శ్రేష్ఠుడు". పురుషులు ఎందరున్నా పురుషోత్తముడు ఒక్కడే! అతడే శ్రీమన్నారాయణుడు. తాను అతని సొత్తు. తన జీవితధ్యేయం హరి చరణకమల ధ్యానం. అటువంటి తనను తీసుకుపోవాలని అనుకుంటున్నాడు శిశుపాలుడు!"గోమాయువు" అంటే నక్క. మృగరాజుకు అర్పించిన నైవేద్యాన్ని గుంటనక్క కాజేయాలని ప్రయత్నించిన విధంగా, పరంధామునికి అంకితమైన తనను ఆ చేదిరాజు వాంఛిస్తున్నాడని తన ఆవేదనను ఆర్తితో వెల్లడిస్తున్నది. ఎత్తైన పర్వతగుహల్లో నివసించేది సింహం! నేలబొరియల్లో ఉండేది నక్క! అందుకే, అధమాధముడైన శిశుపాలునికి అద్భుతమైన నీ శౌర్యప్రతాపాలు తెలియవని అంటున్నది. చైద్యుణ్ణి"అధమాధముడు" అనడంలో ఆ బాలామణి, ఇక్కడ శక్తిస్వరూపిణిగా భాసిస్తున్నది. "చైద్యుడు" అంటే చేదిదేశపు రాజైన శిశుపాలుడు. "మత్తుడు" అంటే మత్తెక్కినవాడు, గర్విష్ఠి. శిశుపాలునిది కంటికీ, ఒంటికీ పొరలు కప్పే తామసమార్గం. రుక్మిణిది ఆ పరాత్పరునికి తనను తాను కాకుకగా ఇచ్చుకున్న పరమ సాత్వికపథం. 

        ఇక, నాల్గవ పద్యమును చూద్దాము. 

నాలుగవ పద్యము

వ్రతముల్, దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్, హరి, జగత్కళ్యాణు గాంక్షించి చే
సితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక! ని
ర్జితులై బోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్
  ఈ పద్యములో తన పూర్వజన్మ సుకృతఫలంగా శ్రీకృష్ణుడే తనకు భర్తగా లభించాలని రుక్మిణి కోరుకుంటున్నది. 

        వెనుకటి జన్మలలో నేను వ్రతములను, దేవతలకు, ఆచార్యులకు, బ్రాహ్మణులకు, జ్ఞానులకు సేవలను, దానధర్మాదులను సర్వేశ్వరుడైన శ్రీవిష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థం చేసివుంటే, ఈ జన్మలో నాకు వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడే ప్రాణనాథుడు కావాలనీ, శిశుపాలాది నీచులు ఆ యదువీరుని చేతిలో సంగరరంగాన నిర్జింపబడాలనీ రుక్మిణి ప్రార్థిస్తున్నది. 

        భగవంతుని ప్రీతి కొరకు ఆయనకు సేవాపరంగా కర్మలను ఆచరిస్తే, అవి భగత్ప్రాప్తిని కలిగిస్తాయని శ్రుతులు, స్మృతులు బోధిస్తున్నాయి. పుణ్యకర్మల చేత భగవానుడు తృప్తినొందినప్పుడు, తానే జీవులను చేబట్టి తన సన్నిధికి చేర్చుకుంటాడు. అందుకే "పుణ్యం కొద్దీ పురుషుడు" అంటారు. కాబట్టి తన పూర్వజన్మ పుణ్యఫలమే తన మనోభీష్టాన్ని పూర్తిచేయగలదని రుక్మిణి విశ్వాసం! 

        "వసుదేవనందనుడు" అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు. అందుకే ఆయనను "వాసుదేవుడు"అంటారు....... దశరథ పుత్రుడైన శ్రీరాముణ్ణి "దాశరథీ" అని సంబోధించడం కూడా ఇట్టిదే! 

ఐదవ పద్యము


        మరి, ఐదవ పద్యములో రుక్మిణి ఏమంటున్నదో చూడండి. 
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.
        ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది. 
  పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము. 

        (మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.) 

        విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమైనవి. అందువల్ల ఆ పంకజనాభుడైన వాసుదేవుడు తలచుకుంటే ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుందనే అర్థం ఈ "పంకజనాభ!" అనే సంబోధనలో స్ఫురిస్తున్నది. 

        వ్యాసమహర్షులవారి "సంస్కృత భాగవతము" లో "నీవు రహస్యంగా విదర్భకు వచ్చి, రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు" అని రుక్మిణి విన్నవించినట్టుగా ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశయైన గోపాలుణ్ణి రహస్యంగా రమ్మనడం పోతనగారికి నచ్చినట్లు లేదు. అందుకే, బాహాటంగా చతురంగబలాలతో రమ్మంటున్నది పోతనగారి రుక్మిణి! 

        ఇకపోతే, వివాహాలు 8 రకములని పెద్దలు చెప్పారు. ఈ ఎనిమిదింటిని "అష్టవిధ వివాహములు" గా మన పూర్వులు వర్గీకరించారు. 

        1) బ్రాహ్మము : ప్రతిఫలాపేక్ష లేకుండా సాలంకృతయైన కన్యను సమర్థుడైన వరునకు ఇచ్చి వివాహం చేయడం. 

        2) దైవము : కన్యాదాత యజ్ఞం చేసి, ఋత్విక్కును పూజించి, అతనికి కన్యను ఇచ్చి పెళ్ళి చేయడం. 

        3) ఆర్షము : కన్య తల్లిదండ్రులు వరుని నుండి గోమిధునాన్ని స్వీకరించి, శాస్త్రవిధేయంగా కన్యను ఇచ్చి వివాహం చేయడం. 

        4) ప్రాజాపత్యము : ' నేను సంతానార్థం పెళ్ళి చేసికొని, గృహస్థాశ్రమధర్మాలు ఆచరిస్తాను ' అని వరునితో ప్రతిజ్ఞ చేయించి, కట్నకానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళి చేయడం. 
  5) రాక్షసము : కన్య తనకు నచ్చినవానిని తనవారి అంగీకారం ఉన్నా, లేకపోయినా (వరునిచే బలాత్కారంగానైనా సరే తీసుకొని వెళ్ళబడి) వివాహం చేసుకోవడం. 

        6) ఆసురము: కన్యాశుల్కం ఇచ్చి పెళ్ళి చేసుకోవడం. 

        7) గాంధర్వము: పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులు పరస్పర ప్రేమానురాగాలతో చేసుకొనే వివాహం.

        8) పైశాచము: స్పృహలేని, తనను తాను రక్షించుకోలేని దశలో ఉన్న కన్యను, కేవలం కామదృష్టితో పెళ్ళి చేసుకోవడం. 

        వీటిలో గాంధర్వము, రాక్షసము అనేవి క్షత్రియులకు శాస్త్రసమ్మతమైనవని "మహాభారతము - ఆదిపర్వము" లో చెప్పబడింది - "గాంధర్వ రాక్షసే క్షత్రే ధర్మ్యౌతౌ మా విశంకిధాః" అని. 

        స్త్రీపురుషులు పరస్పరం ఒకరినొకరు ఇష్టపడి, రహస్యంగా వివాహం చేసుకోవడం ' గాంధర్వము 'అనబడుతుంది. "మహాభారతము" లో శకుంతలా దుష్యంతుల పరిణయం ఈ పద్ధతిలోనే జరిగింది. 

        పురుషుడు తనను ఇష్టపడిన స్త్రీని ఎత్తుకువెళ్ళి వివాహం చేసుకోవడం ' రాక్షసము ' గా చెప్పబడింది."మహాభారతము" లోనే భీష్ముడు తన తమ్ముడైన విచిత్రవీర్యుని కొరకు కాశీరాజు కూతుళ్ళైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరమంటపములోని రాజులందరినీ జయించి, హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్ళి జరిపిస్తాడు. (వారిలో పెద్దదైన అంబ తాను సాళ్వుణ్ణి ప్రేమించానని చెప్తే, ఆమెను వెనక్కి పంపిస్తాడు.) 

        ఇటీవలి చారిత్రికకాలానికి వస్తే, జయచంద్రుని కుమార్తెయైన సంయుక్తను, పృథ్వీరాజు పైవిధంగా స్వయంవరమంటపము నుండి ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటనలు రాక్షసవివాహ పరిధిలోకి వస్తాయి. 

        ఇక్కడ రుక్మిణి సైతం తనను రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ దేవదేవుణ్ణి అర్థిస్తున్నది. అది క్షత్రియోచితమైన కార్యమే కనుక, ఎవరికీ ఆక్షేపించే అవకాశం లేదని ఆమె భావన. 

        ఇక, ఆరవ పద్యము. 
ఆరవ పద్యము

లోపలి సౌధంబులోన వర్తింపంగఁ
....... దేవచ్చునే నిన్ను! దెత్తునేని
గావలివారలఁ గల బంధువులఁ జంపి
....... కాని తేరాదని కమలనయన!
భావించితేని, నుపాయంబుఁ జెప్పెద
....... నాలింపు! కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ
....... బెండ్లికి మునుపడ బెండ్లికూతు

నెలమి మావారు పంపుదు, రేను నట్లు
పురము వెలువడి యేతెంచి, భూతనాథు
సతికి మ్రొక్కంగ, నీవు నా సమయమునకు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత
        క్రిందటి పద్యములో రుక్మిణి తనను క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ వంశీమోహనుడికి విన్నవించింది. ఇప్పుడు ప్రస్తుత పద్యములో అందుకు తగిన సమయమూ, సందర్భమూ కూడా తానే సూచిస్తున్నది. 

        "ఓ కమలాక్షా! 'రాజనగరులోని అంతఃపురసౌధము లోపల సంచరించే నిన్ను హరించి తీసుకురావడం సులభమైన కార్యమా?! ఒకవేళ, అందుకు సిద్ధపడి వచ్చినా ద్వారపాలకులనూ, నీ చుట్టూ పరివేష్ఠించివున్న బంధుజనులనూ నిర్మూలించకుండా నిన్ను బైటకు తేవడం సాధ్యమా?' అని తలుస్తున్నావేమో! అందుకు నేనొక ఉపాయం చెప్తాను. చిత్తగించు! వివాహానికి ముందు వధువు చేత మా ఇలవేల్పు అయిన గౌరీదేవికి పూజ చేయించడం మా కుటుంబ ఆచారం. ఆ పద్ధతి ప్రకారం మావాళ్ళు నన్ను పెళ్ళికూతురును చేసిన పిదప, నగర పొలిమేరలలో ఉన్న పార్వతీదేవి మందిరానికి పంపుతారు. నేను నగరం వెలువడి వచ్చి భూతనాథుని సతికి మ్రొక్కే సమయానికి నీవు అక్కడికి చేరుకుని నన్ను తీసుకువెళ్ళు స్వామీ!" అని రుక్మిణి విన్నవిస్తున్నది. 

        వివాహానికి ముందు పెళ్ళికుమార్తె గౌరీపూజ చేయడం ఈనాటికీ ఆచారంగానే వస్తున్నది. పల్లెటూళ్ళలోనైతే జనులు ఊరి శివార్లలో ఉండే గ్రామదేవత పోచమ్మ గుడికి వెళ్ళి పూజలు సలుపుతారు. ఇదే ఆచారం రుక్మిణి పుట్టింటివారికి కూడా ఉన్నదన్నమాట! 

        పద్యం చివర్లో రుక్మిణి కృష్ణమూర్తిని "అవార్యచరిత!" అని సంబోధించింది. అనగా "అడ్డులేని నడవడి కలవాడా!" అని అర్థం. ' ఈ కార్యం సాధించుటలో నిన్ను వారించడానికి కానీ, ఎదుర్కోవడానికి కానీ ఎవరికీ సాధ్యం కాదు ' అనే ధ్వని ఆ సంబోధనలో గోచరిస్తున్నది 
 ఇప్పుడు ఏడవ పద్యాన్ని ఆస్వాదిద్దాము. 

ఏడవ పద్యము

ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱు జన్మంబులన్
నిను జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!
        నూఱు జన్మలెత్తినా సరే, తాను శ్రీకృష్ణుని సతిగానే ఉంటాననే దృఢనిశ్చయాన్ని రుక్మిణీదేవి ప్రకటిస్తున్నది ఈ పద్యములో! 

        "నా మనోనాయకుడవైన ఓ కృష్ణా! పెద్దలు, బుధులు తమ అజ్ఞానమును తొలగించుకోవడానికి శివునివలె ఎవరి పాదతీర్థమందు స్నానం చేయగోరుతారో, అట్టి నీ కృపకు నేను పాత్రురాలను కాకపోయినట్టయితే, నూఱు జన్మలను ఎత్తియైనా బ్రహ్మచర్య వ్రతదీక్షతో నిన్నే ధానిస్తూ ప్రాణాలను విడుస్తాను. ఇది సత్యం సుమా!"అంటున్నది రుక్మిణి. 

        ఈ పద్యములో "గౌరీశు మర్యాదన్" అని చెప్పారు పోతనామాత్యులు. అనగా, "పరమశివుని వలె" అని అర్థం! మరి, ఎందుకు ఆ విధంగా చెప్పారు?! "వైష్ణవానాం యథా శంభుః" అని వ్యాసభగవానుల సూక్తి. శంకరుడు ఎప్పుడూ ధ్యానముద్రలో, తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు మనకు! ఆయన సదా తన మనసులో మహావిష్ణువునే ధ్యానిస్తుంటాడట! నిజానికి, శివకేశవులకు భేదమే లేదు........ గోస్వామి తులసీదాసుగారు తమ "రామచరిత మానస్" లో, శివుడు సర్వదా రామనామ జపం చేస్తుంటాడని అనేకమార్లు స్పష్టంగా చెప్పారు. 

        "తమో" శబ్దానికి అజ్ఞానం, చీకటి, తమోగుణం, శోకం అని నానార్థాలు ఉన్నాయి. తమస్సు పారమార్థిక జ్ఞానాన్ని కలుగనీయదు. భగవంతుని పాదతీర్థమే ఆ తమస్సును తొలగించి జనులను పవిత్రులను చేస్తుంది. భగవత్పాదజలమే పావనగంగ! వామనావతార ఘట్టములో విష్ణుమూర్తి త్రివిక్రమరూపాన్ని దాల్చినప్పుడు, తన సత్యలోకానికి చేరిన ఆయన పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో ప్రక్షాళన చేశాడు. ఆ జలమే పవిత్రగంగగా భాసించినది. అందుకే గంగను "విష్ణుపాదోద్భవి" అనీ, "నారాయణుని పుత్రిక" అనీ వ్యవహరిస్తారు. ఈ ఘట్టమును పురస్కరించుకునే ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అయిన అన్నమయ్య "బ్రహ్మ కడిగిన పాదమూ" అని కీర్తించాడు భగీరథుని ప్రార్థన ఆలకించి, పరమశివుడు సైతం విష్ణుపాదోద్భవియైన గంగను తన శిరసున ధరించాడు. 
  "అభ్యాగతః స్వయం విష్ణుః" అనే పురాణోక్తిని అనుసరించి, ఈనాటికీ భారతీయ గృహస్థులు తమ ఇళ్ళకు విచ్చేసిన సాధుపుంగవుల పాదాలను కడిగి, పూజించి, ఆ పాదతీర్థాన్ని తమ శిరసులపై చల్లుకొని, లోనికి పుచ్చుకొని తమను, తమ గృహాలను పవిత్రం చేసుకోవడం లోక పరిపాటి! 

        ఇక్కడ మరొక సంగతి కూడా మనం విస్మరించకూడదు రుక్మిణి తాను శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది. కాని,'ఆయన తనను ప్రేమిస్తాడా? ఆయన హృదయంలో తనకు స్థానం లభిస్తుందా?' అనే విషయాలు ఆమెకు తెలియవు. మాధవుడు తన మనవిని మన్నించి తనను చేరదీయకపోతే, తన పరిస్థితి ఏమిటి?! ఆభిజాత్యమూ, అభిమానమూ గల అతివకు అంతకన్నా అవమానం ఏముంటుంది? అటువంటి పరిస్థితే ఎదురైననాడు తనకు ప్రాణత్యాగమే శరణ్యమని రుక్మిణి తలంపు! తన మనస్సులోనైనా వేరొకరిని భర్తగా భావించలేననీ, వంద జన్మలెత్తినా వంశీధరుడే తన వల్లభుడనీ, అందుకు ఆటంకం ఏర్పడితే ఆయననే ధ్యానిస్తూ తన అసువులను అర్పిస్తాననీ చెప్తున్నది. పద్యము చివరిలో "నిక్కంబు ప్రాణేశ్వరా!" అని నొక్కి వక్కాణించడం రుక్మిణీదేవి తెగువను, సాహసాన్ని సూచిస్తున్నది. "ప్రాణేశ్వరా!" అనే సమయోచితమైన సంబోధన కూడా ఈ పద్యానికి మకుటాయమానమై ప్రకాశిస్తున్నది. తన ప్రాణాలకు అధినాథుడుగా భావించుకుంటున్న శ్రీకృష్ణుడు తనను కరుణించకపోతే, ప్రాణాలు తనువును వదిలివెళ్ళడం సహజమే కదా! 

        ఇంక, పరాత్పరునికి ప్రయాణించక తప్పదు మరి! 

        ఇంక, రుక్మిణీసందేశములోని చివరి పద్యం ఎలావుందో చూద్దాము. 

ఎనిమిదవ పద్యము

ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని
........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
........ తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
........ చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగాలేని
........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?!
        రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది. 
   "శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి. 

        మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి. చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు

        ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు. ప్రాణేశ్వరుని సమాగమం, ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థమని ఆమె భావన! ఈ అవయవాలన్నింటికీ సార్థక్యం అదేనని ఆమె విశ్వాసం!....... శరీర సాకల్యానికీ, జన్మ సాఫల్యానికీ చేసిన మహోదాత్త సమన్వయం ఈ పద్య ప్రసూనం! 

        ఈ సందర్భములో, ఈ పద్యానికి సంబంధించిన నా స్వానుభవం ఒకటి ఉటంకించకుండా ఉండలేకపోతున్నాను!........ నాకు బాగా ఇష్టమైన పద్యాల్లో ఇది ఒకటి. చాలారోజుల నుండి, ఈ పద్యమును విన్నప్పుడల్లా నాలో ఒక సందేహం కదలాడుతూ ఉండేది. ఇది సీసపద్యం. సీసపద్యానికి 4 పాదాలు, చివరలో ఎత్తుగీతి ఉంటాయని మనందరికీ తెలిసినదే! ఐతే, పోతనగారు మొదటిపాదములో చెవులనూ, రెండవపాదములో తనువునూ, మూడవపాదములో నేత్రాలనూ, నాల్గవపాదములో జిహ్వనూ ప్రస్తావించి, ఎత్తుగీతిలో నాసిక గురించి చెప్పారు. నాకు ఏమనిపించేదంటే, 'ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అవయవమును అభివర్ణించిన కవీశ్వరులు, 2వ పాదములో మాత్రము సర్వావయవ సమ్మిళితమైన శరీరాన్ని ఎందుకు చెప్పారు?!... ఎత్తుగీతిలో ప్రస్తావించిన నాసికను 2వ పాదములో చెప్పి, తనువును ఎత్తుగీతిలో చెప్పివుంటే ఇంకా బాగా ఉండేది కదా!' అనుకునేవాడిని. సంపూర్ణమైన ఛందోజ్ఞానం నాకు లేకపోవడంచేత, 'ఒకవేళ సీసపద్యము యొక్క ఛందస్సు అందుకు అనుమతించలేదేమో!' అని నాకు నేనే సమాధానం చెప్పుకునేవాడిని. ఐనా, సంతృప్తి కలగక ఎవరైనా విజ్ఞులైనవారితో నా సందేహనివృత్తి చేసుకోవాలని అనుకున్నాను...... ఐతే, ఆశ్చర్యకరంగా నేను ఈ వ్యాసమును తయారుచేసుకునేటప్పుడే తటాలున మెరుపు మెరిసినట్టుగా నా సందేహానికి సమాధానం దొరికింది! 

        అదేమిటో వివరిస్తాను. 
  ఈ మానవ శరీరం పాంచభౌతికమైనదని ఇంతకుముందే చెప్పుకున్నాము. అనగా, పంచభూతముల మేళవింపుతో తయారైనదన్నమాట! పంచభూతములు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము మరియు భూమి. వీటి ఆవిర్భావం ఏ వరుసలో జరిగినదో "భాగవతము" లో విశదంగా ఉంది. ప్రథమంగా అనంతమైన ఆకాశం ఉండేది. తర్వాత వాయువు, ఆపైన అగ్ని, ఆ పిమ్మట నీరు, అటుపైన భూమి ఏర్పడినాయని"భాగవతము" చెప్తున్నది. ఈ పంచభూతముల యొక్క ప్రధానగుణములు సైతం "భాగవతము"లో చెప్పబడ్డాయి. అవి ఎలాగంటే, వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడే గుణములు. అనగా, మొదటిదైన ఆకాశమునకు శబ్దగుణము, రెండవదైన వాయువుకు స్పర్శగుణము, మూడవదైన అగ్నికి రూపము, నాల్గవదైన నీటికి రసగుణము, చివరిదైన పుడమికి గంధగుణము ప్రధానమైనవని చెప్పారు మన మహర్షులు. 

        మనం చెప్పుకుంటున్న సీసపద్యములో పోతనామాత్యులు ఈ క్రమాన్నే పాటిస్తూ, వరుసగా ఒక్కొక్క పాదములో ఒక్కొక్క గుణానికి సంబంధించిన శరీరావయవమును వర్ణించారు. శబ్దగుణముకు ఆలంబనం కర్ణములు కనుక వాటిని మొదటిపాదములో, రెండవదైన స్పర్శగుణానికి ప్రాతినిధ్యం వహించేది చర్మమే కాబట్టి 2వ పాదములో తనువును, మూడవదైన రూపగుణానికి ప్రతినిధులుగా 3వ పాదములో నయనాలను, నాల్గవదైన రసగుణానికి 4వ పాదములో రసనను అనగా నాలుకను, చివరిదైన గంధగుణానికి ఆలంబనమైన నాసికను ఎత్తుగీతిలో పేర్కొన్నారు. 

        పైవిధంగా పర్యాలోచించి చూసుకుంటే, నా సందేహం మబ్బుతెరలా విడిపోయింది. 

        ఈ పద్యములో పురుషోత్తముని వనమాలికను ప్రస్తావించారు పోతనగారు. దీని గురించి ఒకమాట! ' వనమాలిక ' అంటే 5 రకముల పుష్పములతో కూర్చబడి, దేవదేవుని గళం నుండి చరణయుగళం దాకా (కంఠం నుండి పాదముల వరకు) వ్రేలాడుతూ ఉండే పూలమాల. దీనికే "వైజయంతిమాల" అని పేరు....... పరమ భాగవతోత్తముడైన విప్రనారాయణుడు ఈ వైజయంతిమాల అంశతోనే జన్మించినాడని అంటారు. సారంగు తమ్మయ అనే కవీశ్వరుడు విప్రనారాయణుని కథను "వైజయంతీ విలాసము" అనే పేరిట కావ్యంగా వెలయించాడు. 

        మొత్తం మీద రుక్మిణీసందేశములోని ఈ చివరి పద్యము రుక్మిణి దాస్యభక్తితో పాటు, పోతన కవితాశక్తిని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నది. 

***        ***        ***        ***

        రుక్మిణీసందేశ రూపకంగా ఉన్న 8 పద్యాలను నా చేతనైనంతమేరకు వివరించే ప్రయత్నం చేశాను. సాహితీమిత్రులు నా ఈ ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment